
D Spiritual: Sept 18: తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా తిరుపతి మార్గంలో మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది.
ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రయాగ్రాజ్–తిరునెల్వేలి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాగ్రాజ్–తిరునెల్వేలి (04171) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 10 వరకు ప్రతి శనివారం నడవనుంది. తిరునెల్వేలి–ప్రయాగ్రాజ్ (04172) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 12 వరకు ప్రతి సోమవారం సర్వీసులు అందించనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు మాణిక్పూర్, సత్నా, కట్నీ, జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, సాతూర్, కోవిల్పట్టి తదితర స్టేషన్లలో ఆగనున్నాయి.
ఈ రైళ్లలో 3ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ ప్రత్యేక రైలు రేణిగుంట మీదుగా ప్రయాణించడంతో తిరుమల వెళ్లే భక్తులకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి వైపు వెళ్లే రైళ్లలో రద్దీ పెరిగిన సమయంలో ఈ సర్వీసులు ప్రయాణికులకు కొంత వెసులుబాటు కల్పించనున్నాయి.
ఇదిలా ఉండగా, తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో పాటు సెప్టెంబర్ 20 వరకు ఎస్ఎస్డీ టోకెన్ల జారీని నిలిపివేసింది.
