
D Spiritual: Jan 29: పవిత్ర ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, నర్సాపూర్ ఆర్డీవో మైపాల్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్తో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్కింగ్ సదుపాయాలు, విద్యుత్ సరఫరా, తాగునీరు, మార్కెట్లు ఏర్పాటు చేయాలని, జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. మరుగుదొడ్లు, చెత్త సేకరణ, బ్లీచింగ్ పౌడర్ వినియోగం, దోమల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలు నిరంతరం చేపట్టాలన్నారు.
అలాగే వివిధ ప్రాంతాల్లో సైన్బోర్డులు ఏర్పాటు చేయాలని, అంబులెన్స్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అంటువ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కోవిడ్–19 నివారణకు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
రవాణా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని, బస్సులు, వాహనాల నిర్వహణతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల దర్శనానికి క్యూలైన్లు సక్రమంగా ఏర్పాటు చేయాలని, అగ్నిప్రమాదాల నివారణకు అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
జాతరలో వస్తువులను అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని, తినుబండారాల్లో ఎలాంటి రంగులు కలపకుండా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే 18 సంవత్సరాల లోపు వారికి ఎలాంటి మత్తు పదార్థాలు విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఏడుపాయలకు వెళ్లి శనివారం వరకు జాతరకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
