
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన ఆయన, అనుముల కొండల్ రెడ్డిని ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా ప్రకటించాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
నిజమైన స్టార్టప్లను ప్రోత్సహించి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తాము ‘T-Hub’ను నిర్మించామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ ప్రయోజనాల కోసం ‘అనుముల హబ్స్’ ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు.
ఇది ‘ఫ్యామిలీ-రన్, ఫ్యామిలీ-డ్రైవ్, జీరో ఇన్నోవేషన్, జీరో ఎంప్లాయీస్ స్కామ్’ అంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. అనుముల సోదరుల్లో ఒకరి పేరు ఉంటే చాలు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోకుండానే వందల కోట్ల విలువైన భూములు దక్కించుకోవచ్చన్నట్లుగా ఆయన సెటైర్లు వేశారు.
సున్నా పెట్టుబడితో ‘Tesseract Advanced Systems Pvt Ltd’ పేరుతో డిఫెన్స్ కంపెనీ ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే కనీసం రూ.200 కోట్ల లాభం ఆర్జించినందుకు అనుముల కొండల్ రెడ్డిని ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ గా ప్రకటించాల్సిందే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డిలు తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇదే బిజినెస్ మోడల్ను నేర్పించాలని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అత్యంత చౌకగా ఎలా పొందవచ్చో యువతకు శిక్షణ ఇవ్వాలని సెటైర్ వేశారు.
ఈ మ్యాజిక్ ట్రిక్ కేవలం అనుముల కుటుంబానికే పరిమితం కాకుండా తెలంగాణ యువత మొత్తానికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్రవ్యాప్తంగా అనుముల హబ్ అవకాశాలను కల్పించాలని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
