
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ సీనియర్ నేతలు, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులతో చర్చించిన అనంతరం.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఈ ఆర్థిక సాయంలో భాగంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్లు కేటాయించారు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న ఆయన తల్లి అమృతమ్మ సంరక్షణ, అవసరాల కోసం మరో రూ.25 లక్షలను ఆమె పేరుతో బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు.
కేవలం ఆర్థిక సహాయం అందించడంతోనే బాధ్యత ముగియదని కేసీఆర్ పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల విద్య, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ తరఫున నిరంతరం పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు.
దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదినకర్మ కార్యక్రమం పూర్తైన తర్వాత జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై.. ఆ కుటుంబానికి అవసరమైన మరిన్ని సంక్షేమ చర్యలపై నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.
పెద్ది కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలను భవిష్యత్తులోనూ అందిస్తామని స్పష్టం చేశారు.
