
హైదరాబాద్ నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును మరో ఐదు రోజులు పొడిగించింది. తొలుత ఆగస్టు 10వ తేదీ వరకు మాత్రమే అవకాశం కల్పించగా తాజాగా ఆగస్టు 15వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొత్తం లక్ష ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తొలి విడతలో కొంతమంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఇందుకోసం గత నెల 21వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ఆగస్టు 10తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా వరుస సెలవులు, బోనాల పండుగ నేపథ్యంలో ప్రజలకు మరింత అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో అర్హులైన వారు ఆగస్టు 15వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇక హైదరాబాద్లోని పలు నియోజకవర్గాల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, అంబర్పేట, మేడ్చల్, సనత్నగర్, మల్కాజ్గిరి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి కూడా భారీగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
