
DNews: 13 Dec: హైదరాబాద్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పిన తండ్రి దాడిలో 10 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళకు పదేళ్ల క్రితం వివాహం కాగా, దంపతులకు ఓ బాలుడు జన్మించాడు. బాలుడికి షేక్ మహ్మద్ అజహర్ అని పేరు. అయితే, బిడ్డ పుట్టిన తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో మహిళ భర్తకు విడాకులు ఇచ్చి, అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి రెండో భర్తతో నివాసం ఉంటోంది.
అజహర్ ఇరుగు పొరుగు పిల్లలతో తరచూ గొడవలు పడుతుండేవాడు. ఈ గొడవల నేపథ్యంలో పొరుగువారు పిన తండ్రిని ప్రశ్నించడంతో అతడిలో కోపం చెలరేగింది. ఈ నెల 7వ తేదీన కోపావేశంలో బాలుడిని రోడ్డుపై పడేసి తలను బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో అజహర్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వెంటనే గాంధీ ఆస్పత్రి కి తరలించారు. డాక్టర్లు ప్రాణాలు కాపాడేందుకు శ్రమించినప్పటికీ, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి పిన తండ్రిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
