
D News: Jul 28: రంపచోడవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది.
కుటుంబ కలహాల కారణంగా బాలిక తల్లిదండ్రులు కొంతకాలంగా వేర్వేరుగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం తండ్రి వద్దకు వెళ్లిన బాలిక, ఎంతో ఆనందంగా తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. అనంతరం సోమవారం ఉదయం స్కూల్కు వెళ్తానని చెప్పి తల్లి ఇంటికి బయలుదేరింది. తండ్రే స్వయంగా ఆమెను బస్సు ఎక్కించి పంపించారు.
అయితే, తల్లి వద్దకు చేరుకున్న కొద్ది గంటల్లోనే బాలిక ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా కనిపించిన కుమార్తె ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తండ్రి కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ప్రస్తుతం తెలియరాలేదు. తల్లిదండ్రుల మధ్య విభేదాల వల్ల మానసిక ఒత్తిడికి గురైందా? లేక చదువుకు సంబంధించిన ఇతర సమస్యలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం మాత్రమే ఈ విషాద ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
