
D Spiritual: Feb 26: గోదావరి పుష్కరాలు – భద్రతా ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష
పుష్కరాల నిర్వహణపై డీజీపీ సమీక్ష
వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి బుధవారం డీజీపీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, శాంతిభద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో మాట్లాడుతూ పుష్కరాల కోసం ఇప్పటి నుంచే ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలని డీజీపీ సూచించారు.
రెండవ గోదావరి పుష్కరాలు – ప్రత్యేక ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరగనున్న రెండవ గోదావరి పుష్కరాలు కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. గోదావరి నదీతీర జిల్లాలైన నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో వెంటనే ఏర్పాట్లు ప్రారంభించాలని తెలిపారు. మేడారం జాతరలో వినియోగించిన ఆధునిక సాంకేతికతను పుష్కరాల సమయంలో కూడా అమలు చేయాలని సూచించారు.
పోలీస్ ఫుట్బాల్ టోర్నమెంట్పై సమీక్ష
ఇదిలా ఉండగా, మార్చి 23వ తేదీ నుంచి హైదరాబాద్ లో నిర్వహించనున్న 74వ బి.ఎన్. ముల్లిక్ అఖిల భారత పోలీసు ఫుట్బాల్ టోర్నమెంట్పై కూడా డీజీపీ సమీక్షించారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల జట్లతో పాటు పరామిలటరీ విభాగాల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. జట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు వేగవంతం చేయాలని కమిటీలను ఆదేశించారు.
జట్లకు ఘన స్వాగతం – ప్రత్యేక లైజనింగ్ అధికారులు
టోర్నమెంట్కు వచ్చే జట్లకు ఘన స్వాగతం పలకాలని, హిందీ మరియు ఇంగ్లీష్ భాషలు తెలిసిన అధికారులను లైజనింగ్ అధికారులుగా నియమించాలని డీజీపీ సూచించారు. జట్లు తిరిగి వెళ్లే వరకు లైజనింగ్ అధికారులు వారితోనే ఉండాలని తెలిపారు. సమావేశంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, గ్రేహౌండ్స్ అదనపు డీజీ అనిల్ కుమార్, ఐజిలు మరియు కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
