
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణిపై కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ ఉద్యోగిని ఎస్కే ప్రసన్నకుమారి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగినికి రావాల్సిన బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్న విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి వద్ద ప్రస్తావించగా.. తనను 10 శాతం కమీషన్ అడిగారని ప్రసన్నకుమారి ఆరోపించారు. రూ.40 లక్షల పెండింగ్ బిల్లుల విడుదలకు రూ.4 లక్షలు డిమాండ్ చేశారని ఆమె పేర్కొన్నారు.
ఇందిరాపార్క్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ప్రసన్నకుమారి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లుల విడుదలలో జాప్యం కారణంగా రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయంగా రావాల్సిన సొమ్మును కమీషన్తో ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో సుమారు రూ.120 కోట్ల విలువైన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ప్రసన్నకుమారి ఆరోపించారు. బిల్లుల చెల్లింపులకు 6 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇవ్వాల్సి వస్తున్నదని, లేదంటే ఫైళ్లు కదలడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో బిల్లులు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
ఇదిలా ఉండగా.. కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న సంఘం నాయకురాలిగా పేర్కొంటున్న ప్రసన్నకుమారే డిప్యూటీ సీఎం భార్యపై కమీషన్ డిమాండ్ ఆరోపణలు చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ ఆరోపణలపై అధికారిక వర్గాల స్పందన వెలువడాల్సి ఉంది.
