
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని ఆయన కలిశారు. సమ్మక్క-సారక్క బ్యారేజీకి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి NOC ఇవ్వాలని కోరారు.
బ్యారేజీ ముంపు పరిధిలోకి వచ్చే భూములు, ఇళ్లకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం NOC మంజూరు చేస్తే బ్యారేజీలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
సమ్మక్క-సారక్క బ్యారేజీ ద్వారా మొత్తం 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే రామప్ప-పాకాల లింక్ కెనాల్ కింద మరో 30 వేల ఎకరాలకు కొత్త ఆయకట్టు అందించే ప్రతిపాదనను ఛత్తీస్గఢ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
బ్యారేజీ నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు కాగా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించేలా ప్రాజెక్టును రూపొందించారు. అయితే ఛత్తీస్గఢ్ నుంచి NOC అందకపోవడంతో పాటు అంతర్రాష్ట్ర అంశాల పరిశీలన కూడా పెండింగ్లో ఉంది.
బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి తెలంగాణ ఇప్పటికే రూ.9.883 కోట్లు చెల్లించింది. రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రెండు రాష్ట్రాల సహకారంతో సమ్మక్క-సారక్క బ్యారేజీ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
