
సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా, సామూహికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉత్సవాల సన్నాహకాలపై ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశం నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
గణేశ్ మండపాల నిర్వహణ, పారిశుధ్యం, భద్రత, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. భక్తులకు మొక్కలు పంపిణీ చేయాలని, ఉత్సవాల్లో చేనేత కండువాలను వినియోగించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితిని కోరినట్లు చెప్పారు.
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బోనాల ఉత్సవాల సమయంలో మంచి వర్షాలు కురవాలని రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో ఎదురయ్యే ఇబ్బందుల నుంచి ప్రజలు గట్టెక్కి, సమృద్ధిగా వర్షాలు కురవాలని వినాయక మండపాల్లోనూ పూజలు నిర్వహించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితికి ప్రభుత్వం తరఫున సూచించినట్లు మంత్రి వెల్లడించారు.
కోర్టుల ఆదేశాలను గౌరవిస్తూ గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేసిన ఆయన ప్రజలు స్వచ్ఛందంగా, భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
