
D Educt: Aug 31: గిరిజన విద్యార్థుల కోసం విశాఖలో ఎక్స్లెన్స్ సెంటర్
గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విశాఖ జిల్లా మారికవలసలో ఎక్స్లెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి గౌతమి తెలిపారు.
ఈ సెంటర్లో ఇంటర్మీడియట్ విద్యతో పాటు జేఈఈ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. ఇందుకోసం ప్రముఖ విద్యా సంస్థ ఫిజిక్స్ వాలాను ఇప్పటికే ఎంపిక చేసినట్లు గౌతమి వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
మారికవలసనే ఎందుకు ఎంపిక చేశారంటే..
ఉత్తరాంధ్ర ఏజెన్సీ, మైదాన ప్రాంతాలకు చెందిన గిరిజన విద్యార్థులకు రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉండేలా మారికవలసను ఎక్స్లెన్స్ సెంటర్ కోసం ఎంపిక చేసినట్లు గౌతమి తెలిపారు. విశాఖపట్నం విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
మారికవలస పాఠశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులను వారి అభీష్టం మేరకు సమీపంలోని బాలికల క్యాంపస్, కృష్ణాపురం, సబ్బవరం గురుకుల పాఠశాలలకు తరలించినట్లు గౌతమి వెల్లడించారు. విద్యార్థుల విద్యకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
