
హైదరాబాద్, ఆగస్టు 8: నగరంలోని సరూర్నగర్ స్టేడియం వద్ద తోపులాట జరిగింది. హైడ్రాలో 150 డ్రైవర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోటెత్తారు. ఈరోజు(శనివారం), రేపు(ఆదివారం) కార్యక్రమాలు ఉంటాయని హైడ్రా ప్రకటించింది. దీంతో ఈవెంట్స్లో పాల్గొనేందుకు నిరుద్యోగులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది. ఇటీవల హైడ్రా విడుదల చేసిన 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రిక్రూట్మెంట్ ప్రక్రియ తీవ్ర గందగోళానికి దారి తీసింది.
డ్రైవర్ పోస్ట్ల కోసం రాష్ట్రంలోని నలుమూల నుంచి వేలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచే భారీగా సరూర్నగర్ స్టేడియానికి చేరుకున్నారు. కేవలం 150 పోస్టులు ఉండగా ఊహించిన రీతిలో వేలాది మంది పోటెత్తడంతో స్టేడియం మొత్తం నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నప్పటికీ అధికారుల వైపు నుంచి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.
కనీసం తాగడానికి మంచి నీరు కూడా ఏర్పాటు చేయకపోవడంతో లైన్లలో వేచి ఉన్న యువత. నిర్వాహకుల తీరుపై ఆందోళనకు దిగారు. ఉద్యోగం కోసం జిల్లాలు దాటి వస్తే అధికారులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారంటూ నిరుద్యోగులు వాపోతున్నారు. వెంటనే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం అభ్యర్థులకు టోకెన్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. టోకెన్లో చెప్పిన టైమ్ ప్రకారం అక్కడకు వచ్చి ఈవెంట్స్లో పాల్గొనాలని నిర్వాహకులు చెబుతున్నారు.
