
D Spiritual: Apr 22: మనదేశంలోని శివాలయాలలో అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాశీ విశ్వనాథ్ ఆలయంతో సమానమైన ప్రాముఖ్యత కలిగిన శివక్షేత్రం మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. అదే కుండలేశ్వర స్వామి ఆలయం. మార్కండేయ మహర్షి తన చంద్రశేఖరాష్టకంలో ఈ క్షేత్రాన్ని స్తుతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాశీకి ఉన్న పవిత్రత ఈ క్షేత్రానికీ ఉందని నమ్మి దీనిని “దక్షిణ కాశీ”గా కూడా పిలుస్తారు.
ఈ పవిత్ర ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో పవిత్ర గోదావరి నది తీరాన వెలసి ఉంది. ఇక్కడ శివుడు స్వయంభూ లింగరూపంలో దర్శనమిస్తాడు. ఈ లింగం చెవి కుండలంలా ఉండటంతో స్వామిని “కుండలేశ్వరుడు” అని పిలుస్తారు. అందుకే ఈ ప్రాంతానికి “కుండలేశ్వరం” అనే పేరు వచ్చింది.
ఈ క్షేత్రం “వృద్ధ గౌతమి” నది తీరాన ఉన్నది. స్కంద పురాణం ప్రకారం కాశీ యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా ఇక్కడ స్నానం చేసి, కుండలేశ్వరుని దర్శించి తర్వాత కాశీకి వెళ్లాలని సూచించబడింది. అందువల్ల ఈ ప్రాంతానికి విశేషమైన పవిత్రత లభించింది.
వ్యాస మహర్షి కాశీ విడిచి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారని పురాణాలు చెబుతాయి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి చెవి కుండలం పడిన ప్రదేశంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శించిన వ్యాసుడు కాశీ విశ్వనాథుని దర్శించిన అనుభూతిని పొందినట్లు విశ్వాసం ఉంది.
వ్యాస మహర్షి గోదావరికి ఒక ప్రత్యేక వరం ఇచ్చారని కూడా నమ్మకం. ఇతర నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే, వృద్ధ గౌతమికి ప్రతి రోజూ పుష్కర ఫలం ఉంటుందని ఆయన వరమిచ్చాడని చెబుతారు. అందువల్ల ఇక్కడ ఎప్పుడు స్నానం చేసినా పుణ్యఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
పురాణాల ప్రకారం గంగానది భక్తుల పాపాలను తొలగించిన తరువాత ప్రతి రాత్రి ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి తన పవిత్రతను కాపాడుకుంటుందని కథనం. అలాగే వృద్ధ గౌతమి సముద్రంలో కలిసే సమయంలో సముద్రుడు రెండు కుండలాలను బహుకరించాడని చెబుతారు. అందులో ఒకటి భూమిపై కుండలేశ్వర స్వామిగా వెలసిందని విశ్వాసం. బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు, ఋషులు వచ్చి స్వామిని ఆరాధిస్తారని కూడా భక్తుల నమ్మకం.
ఆలయంలోని శివలింగం ప్రత్యేకంగా కుండలం ఆకారంలో ఉంటుంది. గోపురంపై శివుని వివిధ రూపాలు, లీలలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు, కాలభైరవుడు, వనదుర్గ, వేణుగోపాల స్వామి, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వంటి అనేక ఉపాలయాలు ఉన్నాయి.
ఈ ఆలయంలో ప్రతిరోజూ త్రికాల పూజలు జరుగుతాయి. ప్రతి సోమవారం అభిషేకం నిర్వహిస్తారు. మహాశివరాత్రి, హనుమజ్జయంతి, కార్తికమాసం వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. కార్తిక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం ప్రత్యేక ఆకర్షణ. కుండలేశ్వర స్వామిని దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
