
D Spiritual: Jan 29: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో నేడు అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. మహాజాతర మూడవ రోజైన ఇవాళ భక్తుల ఆరాధ్య దైవం, కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదీరనుంది. గిరిజన సంప్రదాయాల ప్రకారం చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న తల్లిని పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో తీసుకువస్తారు.
కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లి నిన్ననే గద్దెపైకి చేరుకోగా, నేడు సమ్మక్క తల్లి కూడా చేరుకోవడంతో జాతర పూర్తిస్థాయి వైభవాన్ని సంతరించుకుంటుంది. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.
సమ్మక్క తల్లి గద్దెపైకి వచ్చే సమయంలో అటవీ ప్రాంతం జైత్రయాత్రను తలపిస్తుంది. తల్లి ఆగమనం సందర్భంగా ప్రభుత్వం తరపున జిల్లా ఎస్పీ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరపడం ఇక్కడి సంప్రదాయం. ఆ గంభీర శబ్దాల మధ్య భక్తుల శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో మేడారం పరిసరాలు మార్మోగిపోతాయి. తల్లి రాకను సూచిస్తూ పూజారులు చేసే ప్రత్యేక నృత్యాలు, కట్టుబాట్లు జాతర విశిష్టతను చాటిచెబుతాయి.
వనదేవతల దర్శనం కోసం భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. కేవలం నిన్న ఒక్కరోజే దాదాపు 40 లక్షల మంది భక్తులు గద్దెలను దర్శించుకోవడం ఈ జాతర ప్రాశస్త్యాన్ని వెల్లడిస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మేడారానికి క్యూ కడుతున్నారు.
భక్తులు తమ మొక్కుల ప్రకారం నిలువెత్తు బంగారంగా భావించే బెల్లాన్ని సమర్పించి, జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నేడు సమ్మక్క ప్రతిష్ఠాపన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భద్రతా దృష్ట్యా పోలీస్ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.
