
DSports 28Jan 2026:బులవాయో (జింబాబ్వే): ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. మంగళవారం బులవాయో వేదికగా జరిగిన సూపర్ సిక్స్ పోరులో ఆతిథ్య జింబాబ్వేపై 204 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్లో విహాన్ మల్హోత్రా మెరుపు శతకం బాదగా, బౌలింగ్లో ఆయుష్ మాత్రే, ఉదవ్ మోహన్ ప్రత్యర్థిని కట్టిపడేశారు.
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (30 బంతుల్లో 52), ఆరోన్ జార్జ్ (23) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఒకే ఓవర్లో వీరిద్దరూ అవుట్ కావడంతో భారత్ స్వల్ప ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విహాన్ మల్హోత్రా (107 బంతుల్లో 109 నాటౌట్; 7 ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
- విహాన్, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు (61) తో కలిసి ఐదో వికెట్కు 113 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో ఖిలాన్ పటేల్ (12 బంతుల్లో 30) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు సాధించింది.
- 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ రెండో బంతికే వికెట్ కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత కోలుకోలేకపోయింది.కెప్టెన్ ఆయుష్ మాత్రే (3/14), ఉదవ్ మోహన్ (3/20) తలో మూడు వికెట్లతో జింబాబ్వే వెన్ను విరిచారు. జింబాబ్వే ఆటగాళ్లలో లీరాయ్ చివులా (62) ఒక్కడే అర్ధసెంచరీతో పోరాడాడు. మిగిలిన వారు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
