
D Spiritual: Dec 20: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం కావడంతో సాధారణ రోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శనివారం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా భావించబడడంతో ఈ రోజున ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు.
శనివారం నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో తిరుమలలో వసతి గదులు దొరకడం కష్టమవుతోంది. అలాగే శ్రీవారి దర్శనానికి కూడా గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు.
శనివారం తరువాత ఆదివారం కూడా సెలవు దినం కావడంతో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. ముందుగా రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు, రోజు వారీ ఎస్.ఎస్.డి టోకెన్లతో కొండకు చేరుకునే వారు, శ్రీవాణి టిక్కెట్ల ద్వారా వచ్చే భక్తులు, అలాగే కాలినడకన వచ్చే భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు దర్శనం కలగడానికి పన్నెండు గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
టైమ్ స్లాట్ దర్శనం టిక్కెట్లు తీసుకున్న భక్తులకు సుమారు ఐదు గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయంలో పూర్తవుతోంది.
నిన్న తిరుమల శ్రీవారిని మొత్తం 64,729 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,162 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే నిన్న శ్రీవారి హుండీ ద్వారా రూ.4.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
