
D Spiritual: Dec 20: 2025వ సంవత్సరం ముగింపుకు చేరుకుంటున్న వేళ, భారతీయ ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక రంగంలో కొన్ని దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా విశేషంగా నిలిచాయి. ఈ ఏడాది జరిగిన చారిత్రాత్మక ఘట్టాలు భక్తులలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా అయోధ్య, పూరి మరియు గోవాల్లో జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా విశేష ఆకర్షణగా మారాయి.
అయోధ్యలోని శ్రీరామమందిరం 2025 నవంబర్ 25న ఒక చారిత్రక మైలురాయిని చేరుకుంది. 2024లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం, శ్రీరాముడు–సీతాదేవుల కళ్యాణం జరిగిన వివాహ పంచమి పర్వదినాన ధ్వజారోహణతో సంపూర్ణమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా మందిర శిఖరంపై కాషాయ జెండాను ఆవిష్కరించడంతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తైనట్లు ప్రకటించారు. ఈ జెండాపై సూర్యుడు, ఓం, కోవిదార వృక్షం వంటి పవిత్ర చిహ్నాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఒడిశాలోని పూరిలో ప్రతి ఏటా నిర్వహించే జగన్నాథ రథయాత్ర 2025లోనూ భక్తజన సంద్రంతో కనులపండువగా సాగింది. ఈ ఏడాది జూన్ 27న ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు ఈ మహోత్సవం ప్రారంభమైంది. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి మూడు భారీ రథాలపై అత్తగారి ఇల్లైన గుండిచా ఆలయానికి పయనమయ్యారు. ఈ పవిత్ర యాత్రను దర్శించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలివచ్చారు.
సాధారణంగా పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్గా పేరొందిన గోవా, 2025లో ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. కణకోణలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠం 550వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 28న ప్రధానమంత్రి చేతుల మీదుగా 77 అడుగుల ఎత్తైన భారీ కాంస్య శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరామ విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఈ అద్భుతమైన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. ఇదే సందర్భంలో ఇక్కడ రామాయణ ఇతివృత్తంతో రూపొందించిన థీమ్ పార్కును కూడా ప్రారంభించారు. దీంతో గోవా రాష్ట్రం పర్యాటకంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రత్యేక గుర్తింపును సాధించింది.
