
DNews:02 Dec:హైదరాబాద్ దేశంలోనే అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటైన హైదరాబాద్ మెట్రో రైలు, సామాజిక సాధికారత దిశగా చారిత్రక అడుగు వేసింది. ప్రతిరోజూ సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ, తన భద్రతా విభాగంలో ఏకంగా 20 మంది ట్రాన్స్జెండర్ సిబ్బందిని నియమించింది.57 స్టేషన్లతో కూడిన ఈ మెట్రో వ్యవస్థలో ప్రయాణించే వారిలో మహిళలు సుమారు 30 శాతం మంది ఉన్నారు. వారి భద్రత, సౌకర్యం, విశ్వాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, తెలంగాణ ప్రభుత్వ సమానత్వం, గౌరవం, సమాన అవకాశాల దృష్టితో ఈ నియామకాలు జరిగాయి. ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న ఈ ట్రాన్స్జెండర్ సిబ్బంది సోమవారం నుంచే ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో విధులను ప్రారంభించారు.
జనరల్ మరియు మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్లలో భద్రతా చర్యలు చేపట్టడం.ప్రయాణికులకు దిశానిర్దేశం చేయడం, సమాచారం మరియు అవసరమైన సహాయాన్ని అందించడం.ప్రయాణికులు సురక్షితంగా వెళ్లేలా స్కానర్ కార్యకలాపాలను పర్యవేక్షించడం.స్ట్రీట్-లెవెల్ మరియు కాన్కోర్స్ భద్రతలో కూడా వీరు పాలుపంచుకుంటారు.ట్రాన్స్జెండర్ సిబ్బందిని భద్రతా విభాగంలో నియమించడం వల్ల మహిళా ప్రయాణికుల భద్రతా వాతావరణం మరింత బలపడుతుందని, ఇది సామాజిక సాధికారతకు శక్తివంతమైన సంకేతంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.హైదరాబాద్ మెట్రో రైలు, ప్రయాణికులకు సురక్షితమైన, సమర్థవంతమైన మొబిలిటీని అందించడానికి కట్టుబడి ఉంది. ఈ ప్రగతిశీల నిర్ణయం, వివిధ ప్రజా సేవా రంగాల్లో ట్రాన్స్జెండర్ సిబ్బంది నియామకానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉంది.
