
D Spiritual: Nov 27: తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా అంకితం చేయబడతాయి. అయితే మాసాలకు శిరోమాణి అయిన మార్గశిర మాసంలో గురువారాల్లో చేసే వ్రతం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుందని పురాణాలు పేర్కొంటాయి. అందువల్ల మార్గశిర గురువారం వ్రతం ఎలా చేయాలి, దీని ఫలితం ఏమిటి అనే విషయాలను పరిశీలించాలి.
హేమంతఋతువులో మంచు తీవ్రత వ్యాపించిన కాలంలో మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో గురువారాల్లో లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అనేక శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీవారాల్లో ఇళ్లలో లక్ష్మీ స్తోత్రాలు, సహస్రనామాల పఠనాలు మార్మోగుతాయి. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మాసం, ఆయన సహధర్మిణి అయిన మహాలక్ష్మికి కూడా అత్యంత ఇష్టమైనదిగా భావించబడుతుంది.
మార్గశిర మాసం మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు లక్ష్మీదేవిని సంపూర్ణ నియమనిష్టలతో పూజిస్తే కనకమహాలక్ష్మి కటాక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ మాసంలో మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా ధ్యానించిన వారికి సంవత్సరమంతా అష్టలక్ష్మి వైభవం ప్రసాదమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ వ్రతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఏర్పడింది.
లక్ష్మీ అనుగ్రహం కోరుకునే వారు ఈ మాసంలో వచ్చే ఐదు గురువారాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ వ్రతాన్ని లక్ష్మీవార వ్రతం, గురువార లక్ష్మీ పూజ లేదా లక్ష్మీ నోము అని పిలుస్తారు. మార్గశిర మాసంలో నాలుగు మాత్రమే గురువారాలు ఉంటే, ఐదవ పూజను పుష్యమాసం మొదటి గురువారంలో కొనసాగిస్తారు.
వ్రతాన్ని ఆచరించే రోజు ఉదయం స్నానం చేసి ఇంటి ముందు రంగవల్లులు వేయాలి. తరువాత పూజా మందిరంలో లక్ష్మీదేవి ప్రతిమను ప్రతిష్ఠించి పూలు, కలువ, మారేడు దళాలతో అలంకరించాలి. ముందుగా తమలపాకులో పసుపు గణపతిని తయారు చేసి పూజించి బెల్లం నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిర్వహిస్తారు. పూజ అనంతరం కనకధారా స్తోత్రం, అష్టోత్తర శతనామావళి పఠనాలు చేసి, మహానైవేద్యం సమర్పించి, చివరగా లక్ష్మీవార వ్రత కథ వినిపిస్తారు.
ఈ వ్రతంలో ప్రతివారం ఒకే విధమైన నైవేద్యం ఇవ్వకూడదు. ప్రతి గురువారానికీ ప్రత్యేకమైన నైవేద్యాలు నిర్ణయించబడ్డాయి — మొదటి గురువారంలో పులగం, రెండోవారంలో అట్లు–తిమ్మనం, మూడోవారంలో అప్పాలు–పరమాన్నం, నాల్గోవారంలో చిత్రాన్నం–గారెలు, ఐదోవారంలో పూర్ణం బూరెలు సమర్పించాలి.
వ్రతం చివరి గురువారంలో ఐదుగురు ముత్తయిదువులను ఇంటికి ఆహ్వానించి స్వయంగా వండి భోజనం పెట్టాలి. అనంతరం తాంబూలం, దక్షిణ ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. ఇదే వ్రతం పూర్తయిన సూచకంగా భావిస్తారు. మంగళగౌరీ వ్రతంలా ఉద్యాపన అవసరం లేని ఏకైక వ్రతం ఇది. ఎందుకంటే సౌభాగ్యలక్ష్మి నిత్యం ఇంటిని కటాక్షించాలనే సంకల్పంతో ఈ పద్ధతి పాటించబడుతుంది.
వ్రతాన్ని నిర్వర్తించే వారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. శుచిగా ఉండడం, అసత్యం చెప్పకపోవడం, తలకు నూనె రాయకపోవడం, జుట్టు దువ్వుకోకపోవడం, చిక్కులు తీసుకోకపోవడం, సంధ్య సమయంలో నిద్రపోకపోవడం వంటి నియమాలు ముఖ్యమైనవి. ఇలా భక్తి, శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి ఐశ్వర్యదేవి అనుగ్రహించి సిరిసంపదలు, విజయాలు వరంగా ప్రసాదిస్తారని విశ్వాసం.
ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః
