
D Spiritual: Nov 27: కలియుగ వైకుంఠ నాథుడు శ్రీవేంకటేశ్వరుడు. భక్తుల పిలుపు పలికే కలియుగ దైవంగా ఆయనకు కోట్లాది మంది భక్తులున్నారు. ఆపదలో ఆపన్నహస్తం అందించే దేవుడు, అనాథలకు నాథుడు, కష్టాల్లో కడతేర్చే దైవం అని నమ్మి భక్తులు తమ కోరికలను స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ పూర్వం నుంచి ముడుపులు కట్టి మొక్కులు పెట్టుకుంటున్నారు.
వివాహం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం – ప్రమోషన్ కోసం, ఇల్లు లేదా స్థలం కొనడం – అమ్మడం కోసం, అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యం కుదుటపడాలని, రైతులు పంట నష్టం లేకుండా చేతికి రావాలని, ప్రారంభించిన నిర్మాణం ఆటంకం లేకుండా పూర్తవ్వాలని—ఇలాంటి అనేక సమస్యలకు స్వామివారికి భక్తులు ముడుపులు కడతారు.
ఎడుకొండలవాడికి ముడుపు కట్టే విధానం కూడా శాస్త్రోక్తంగా, భక్తితో చేయాలి. శనివారం ఉదయం నిత్య దీపారాధన అనంతరం ముందుగా వినాయకుడిని పూజించాలి. మీ కోరికను చెప్పి, స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలని ప్రార్థించాలి. తెల్లటి బట్టకు పసుపు తడిపి ఆరబెట్టి, బట్ట నాలుగు వైపులా కుంకుమ పెట్టాలి. అందులో 11 రూపాయలు లేదా మీ శక్తి మేరకు కొంత డబ్బు పెట్టి, ఎందుకు ముడుపు కడుతున్నారో భక్తిగా స్వామికి తెలియజేయాలి.
డబ్బు పెట్టిన ఆ పసుపు బట్టను మూడు ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తానని ముందుగానే మాట ఇవ్వాలి. అనంతరం శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టోత్తరం, గోవింద నామాలు చదివి స్వామికి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ముడుపుకూ హారతి ఇచ్చి, ఆ ముడుపు మీ కోరిక నెరవేరే వరకు స్వామి ముందే ఉంచాలి.
కోరిక తీరిన తర్వాత తిరుమలకు వెళ్లి, ఆ ముడుపును కొద్దిగా వడ్డీతో కలిసి హుండీలో వేసి మొక్కు తీర్చాలి. ఇలాంటి భక్తి, నమ్మకంతో చేసిన ముడుపులు కోరికలను నెరవేర్చుతాయని చెప్పబడుతుంది. కాబట్టి మీ ధర్మబద్ధమైన కోరికలు సఫలమవ్వాలని కోరుకుంటే, ఆపదలో రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరునికి ముడుపు కట్టి ఆశీర్వాదం పొందండి. మీ జీవితాన్ని సంతోషమయం చేసుకోండి.
