
D Spiritual: Nov 27: పెళ్లి అయిన స్త్రీలు కాలికి మెట్టెలు ధరించే సమయంలో కొన్ని తప్పులు పూర్తిగా నివారించాలంటూ పండితులు సూచిస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి అనంతరం స్త్రీలు జీవితంలో కొన్ని కొత్త అలవాట్లు అలవర్చుకోవాలి. వారు ధరించే ఆభరణాలు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని పొందుతాయి. మాంగల్యం, గాజులు, నుదుటి సింధూరం, కాలికి మెట్టెలు—ఇవన్నీ వివాహిత స్త్రీ గుర్తింపుకే కాక, శుభసూచకాలుగా భావించబడతాయి. అందువల్ల మెట్టెలు ధరించే విషయంలో చిన్న తప్పూ చేయకుండా జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది.
వివాహ సందర్భంలో అమ్మాయి లేదా అబ్బాయి కాలికి మేనమామ మెట్టెలు తొడగడం ఒక ముఖ్యమైన సంప్రదాయం. పెళ్లి తర్వాత స్త్రీలు ధరించే ఈ మెట్టెలు చంద్రుని సూచిస్తాయని, అందుచేత అవి ఎల్లప్పుడూ రెండవ వేలికి మాత్రమే ధరించాలంటారు. ఈ మెట్టెలను ఇతరులకు ఇవ్వడం లేదా తాత్కాలికంగా తీసి పక్కన పెట్టడం శుభం కాదని పండితులు చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు మెట్టెలను తీసి పక్కన పెట్టడం కొన్ని చోట్ల అలవాటై ఉన్నా, ఇది పూర్తిగా తప్పు అనే అభిప్రాయం ఉంది.
పెళ్లైన స్త్రీలు ఎల్లప్పుడూ వెండి మెట్టెలను మాత్రమే ధరించాలి. ధనవంతులు చాలామంది బంగారు మెట్టెలను ధరిస్తారు, కాని ఇది శాస్త్రపరంగా అనుకూలం కాదట. బంగారులో లక్ష్మీదేవి నివసిస్తారని నమ్మకం. అలాంటి పవిత్రమైన బంగారును కాళ్లకు మెట్టెలుగా ధరించడం అమ్మవారిని అవమానించినట్టేనని పురోహితులు పేర్కొంటారు. అందువల్ల బంగారు మెట్టెలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.
అలాగే పెళ్లైన స్త్రీలు ఎప్పుడూ మెట్టెలు లేకుండా తిరగకూడదు. ఖాళీ కాళ్లతో ఉండడం శుభం కాదనీ, ఇది గృహశాంతి, సౌభాగ్యానికి అనుకూలం కాదని చెబుతారు. అందుకే మెట్టెలు ప్రతిరోజూ, అన్ని సమయాల్లో ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
