
DNews:15 NOV: జహీరాబాద్ శనివారం ఉదయం పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో డీఎస్పీ సైదా నాయక్ నేతృత్వంలో కార్డెన్సర్చ్ (కమ్యూనిటీ కాంటాక్ట్ సెర్చ్) నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి, కాలనీలోని కుటుంబాల సమాచారాన్ని పోలీసులు సేకరించారు.ఈ సోదాల సందర్భంగా, ఓ వ్యక్తి వద్ద ఎయిర్ గన్ మరియు దుప్పి కొమ్ములు లభించాయి. అలాగే, సరైన పత్రాలు లేని 32 బైకులు, 14 ఆటోలు, మరియు రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సైదా నాయక్ మాట్లాడుతూ, ప్రజలు సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నివారణ అందరి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
భూ కబ్జాలు, గొడవలకు పాల్పడి అమాయకులను మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. ముఖ్యంగా, జహీరాబాద్ పట్టణ శివారులోని పరిశ్రమల్లో పని కోసం వచ్చే వ్యక్తులకు గుర్తింపు కార్డు (ID) లేకుండా ఎవరూ అద్దెకు ఇవ్వకూడదని స్థానికులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ శివలింగం, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
