
22ఏ భూముల విషయంలో యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం. ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు భూమి అని నిర్ధారణ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్న వారి ఆస్తులు 22ఏ జాబితాలో ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా పరిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
22ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, పరిశీలనను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూ హక్కుల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు.
22ఏ భూముల వ్యవహారంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని, వదంతులు, కట్టుకథలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వబోమని హామీ ఇచ్చారు.
