
DNews:05 Mar: హైదరాబాద్లోని టోలిచౌకి పరిధిలో గురువారం సాయంత్రం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అల్ హస్నాత్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక భవనంపై పనులు నిర్వహిస్తుండగా, ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. భవనం స్లాబ్ పనుల కోసం ఏర్పాటు చేసిన పరందా (Scaffolding) ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. భవన నిర్మాణ సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిర్మాణ సంస్థ యజమాని మరియు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై విచారణ ప్రారంభించారు.
