
DNews:11 NOV:నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉపాధ్యాయుల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జెడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థులు బొలెరో వాహనంలో పాఠ్యపుస్తకాలను తీసుకువస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో 9వ తరగతి విద్యార్థులు నాని, నందు చరణ్ తేజ, కార్తీక్, శివ, ఆనంద్ తీవ్ర గాయాలు పొందారు. శివకు తీవ్రమైన గాయాలు కావడంతో అతడిని వెంటనే హైదరాబాదు గాంధీ ఆసుపత్రికి తరలించారు. మిగతా విద్యార్థులు నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పాఠ్యపుస్తకాల రవాణా కోసం కూలీలను ఉపయోగించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, విద్యార్థులను బొలెరోలో పంపిన ఉపాధ్యాయుల చర్యపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వాదిస్తున్నారు.
వాహనం బోల్తాపడిన వెంటనే గ్రామస్థులు స్పందించి గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
మాజీ ఎమ్మెల్యే బీరం స్పందన
ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంతోష్తో ఫోన్లో మాట్లాడి ఘటనపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో పనులు చేయించడం తీవ్రమైన తప్పిదమని ఆయన విమర్శించారు.
