
DNews:24 Nov:సిరిసిల్ల టౌన్,సెస్ (CES – Cooperative Electric Supply Society) సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే, సమ్మె చేపడతామని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రావు హెచ్చరించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి సెస్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ముందు ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఈశ్వర్ రావు మాట్లాడుతూ, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పలు ప్రధాన డిమాండ్లను లేవనెత్తారు:సెస్ సంస్థలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు కల్పించాలి.కారుణ్య నియామక సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.అసిస్టెంట్ హెల్పర్లను జెఎల్ఎం (JLM) గా పేరు మార్చాలి.ఒకే విభాగంలో 8, 12, 18, 24 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు టిజిఎన్పిడిసిఎల్ (TGNPDCL) లో అమలులో ఉన్న మానిటరీ బెనిఫిట్స్ (Monetary Benefits) ను ఇవ్వాలి.కార్మికులకు, ఉద్యోగులకు లీవ్ ఎన్క్యాష్మెంట్ విధానం అమలుచేయాలి.ఎఫ్టిఎ (FTA) ను పునరుద్ధరించాలి.పెరిగిన సర్వీసులకు అనుగుణంగా కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలి.ప్రతి ఉద్యోగికి నాణ్యమైన రక్షణ పరికరాలు అందించాలి.సెప్టెంబర్-2025లో ఇవ్వాల్సిన ఆన్యువల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ను వెంటనే చెల్లించాలి.
ఈ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలువాల స్వామి, సీఐటీయూ నాయకులు కోడం రమణ, మూషం రమేష్, సెస్ కార్మికులు పాల్గొన్నారు.
