
DNews:25 Nov:ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్య పరిష్కారం కావడం లేదని విసుగు చెందిన ఓ రైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి కార్యాలయంలోనే అడ్డంగా పడుకుని రైతు నిరసన తెలిపాడు.
నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంకు చెందిన రైతు కొలిపాక రామదాసు తన భార్య కొలిపాక భారతమ్మతో కలిసి ఈ నిరసన చేపట్టారు.తన భార్య పేరు మీద రికార్డులు ఉన్న భూమికి ఆధారాలు చూపించినప్పటికీ, అధికారులు తమకు భూమి చూపించడం లేదని రైతు రామదాసు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ భూ సమస్యపై హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆ తీర్పును పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని వినతులు ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగు చెంది, చివరి ప్రయత్నంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట అడ్డంగా పడుకుని వినూత్న నిరసన తెలిపారు. దీనిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై అధికారులకు చిత్తశుద్ధి కనిపించడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి కార్యాలయానికి వచ్చిన ప్రజలకు చేదు అనుభవం ఎదురైంది. ఒక్క అధికారి కూడా సమయానికి ప్రజావాణికి హాజరు కాలేదు.ఉదయం 10:30 గంటలు దాటినా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సైతం లేకపోవడంతో, పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు చెట్ల కిందనే ఎదురుచూడాల్సి వచ్చింది.ప్రజావాణికి అధికారులు ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, తమకు సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శించారు. సమయానికి సిబ్బంది లేకపోవడంతో పనుల కోసం వచ్చిన ప్రజలు వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నేలకొండపల్లి మండల అధికారులు ప్రజావాణికి సక్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
