
DNews:18 NOV:సంతానం కోసం ఐవీఎఫ్ (IVF) చికిత్స తీసుకుని, కవల పిల్లల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్న బెంగళూరుకు చెందిన ముత్యాల విజయ్ (40), శ్రావ్య (35) దంపతుల జీవితం కొన్ని గంటల్లోనే విషాదాంతమైంది. ఏడాదిన్నర క్రితం శంషాబాద్కు వలస వచ్చి ఎయిర్పోర్టులో ఉద్యోగం చేస్తున్న విజయ్, ఎనిమిది నెలల గర్భిణి అయిన తన భార్య శ్రావ్యతో కలసి కవలల రాక కోసం ఎన్నో కలలు కన్నారు. అయితే, 2025 నవంబర్ 16వ తేదీ రాత్రి, శ్రావ్యకు అకస్మాత్తుగా కడుపు నొప్పి రావడంతో ఆమెను అత్తాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గర్భంలో పెరుగుతున్న కవలలు ఇద్దరూ మృతి చెందారని చెప్పడంతో ఆ దంపతులు తీవ్ర ఆఘాతానికి గురయ్యారు. ఈ షాక్ను తట్టుకోలేక స్పృహ కోల్పోయిన శ్రావ్యను మెరుగైన చికిత్స కోసం గుడిమల్కాపూర్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె తుదిశ్వాస విడిచింది. కొద్ది గంటల వ్యవధిలోనే ప్రేమగా చూసుకున్న భార్య, కలలుగన్న కవలలు కనుమరుగు కావడంతో భర్త ముత్యాల విజయ్ గుండె పగిలిపోయింది. తన జీవితం శూన్యమైందని భావించిన ఆయన, ఈ తీరని బాధతో సోమవారం (నవంబర్ 17) తెల్లవారుజామున శంషాబాద్లోని తమ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిన్నటి వరకు నవ్వులతో కళకళలాడిన ఆ ఇల్లు, ఒక్కసారిగా శోకసంద్రమైంది. ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ కె.బాల్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం… ఈ హృదయ విదారక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
