
DNews:23 Dec: హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో మంగళవారం డిసెంబర్ 23, మధ్యాహ్నం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక వాహనం ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొట్టి, ఆపకుండా వెళ్లిపోవడంతో (హిట్ అండ్ రన్) ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.మృతుడిని అబ్దుల్ సత్తార్ (కానిస్టేబుల్)గా గుర్తించారు. ఆయన టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు.
అబ్దుల్ సత్తార్ తన విధులను ముగించుకుని అత్తాపూర్ మీదుగా హసన్ నగర్లోని తన ఇంటికి బైక్పై వెళ్తున్నారు. రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఉప్పర్పల్లి పిల్లర్ నంబర్ 191 వద్దకు రాగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక డీసీఎం (DCM) వాహనం ఆయనను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో సత్తార్ కారు కింద పడిపోగా, ఆయన తలపై నుంచి వాహనం వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు, ఇతర వాహనదారులు సాహసంతో ఆ డీసీఎంను వెంబడించి, కొంతదూరంలో అడ్డుకుని డ్రైవర్ను పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.ఈ ప్రమాదం కారణంగా అత్తాపూర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
