
DNews:20 Nov:హైదరాబాద్, తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ-కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. గవర్నర్ ఆమోదంతో ఈ కేసులో కేటీఆర్పై చార్జ్షీట్ వేసేందుకు లైన్ క్లియర్ అయినట్టు అయింది.ఫార్ములా ఈ-కార్ రేసు నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణకు అనుమతి కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. ఈ లేఖపై గవర్నర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. చార్జ్షీట్ దాఖలుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ కేసు విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే స్పందించారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై చేస్తున్నవన్నీ ‘ఉద్దేశపూర్వక, నిరాధారమైన నిందారోపణలే’ తప్ప, వాటిలో నిజాలు ఎంత మాత్రం లేవని ఆయన స్పష్టం చేశారు. సర్కార్ మోపిన ‘అబద్ధాలను’ తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కేటీఆర్ గట్టిగా చెప్పారు.కాగా, ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు కేటీఆర్ ఇప్పటికే నాలుగుసార్లు హాజరయ్యారు. తాజా పరిణామం నేపథ్యంలో ఈ కేసు విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
