
DNews:14 Mar: తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 2,676 కేంద్రాల్లో 5,28,239 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా విద్యాశాఖ అధికారులు ఈసారి నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ముఖ్యంగా విద్యార్థులకు అందజేసే జవాబు పత్రాల విషయంలో బోర్డు కీలక హెచ్చరిక జారీ చేసింది. విద్యార్థులు తమకు ఇచ్చిన మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి ఏవైనా పేజీలను చింపినా లేదా వేరు చేసినా దానిని మాల్ప్రాక్టీస్గా పరిగణిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిని వెంటనే పరీక్ష నుండి డిబార్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం నిబంధనను కూడా అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, 9:35 గంటల తర్వాత వచ్చే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించడం లేదు. విద్యార్థులు తమ వెంట కేవలం హాల్ టికెట్ మరియు పెన్నులు మాత్రమే తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించామని విద్యాశాఖ తెలిపింది. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
