
DNews: Mar 14: మెదక్ జిల్లా శివంపేట్ మండలంలోని పాంబండ గ్రామానికి చెందిన కుంచరాజు నాగరాజు శనివారం అర్ధరాత్రి ఉసిరికపల్లి గ్రామం అవతల జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. నాగరాజు అంత్యక్రియలు ఆదివారం జరగాల్సి ఉండగా, ఆయన కుమారుడు ధనుష్ తన తండ్రి మరణవేదనను హృదయంలో దాచుకొని, కన్నీళ్లతోనే పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. తండ్రి కలలైన మంచి చదువు సాధించాలని సంకల్పంతో, అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే ధైర్యంగా పరీక్ష రాయడానికి వెళ్లిన ధనుష్ను చూసి గ్రామస్థులు కదిలిపోయారు. “ఎంత కష్టమైనా చదువును వదిలిపెట్టలేదు” అంటూ ఆయనను ఓదార్చారు. అధికారులు, ఉపాధ్యాయులు కూడా ధనుష్కు ధైర్యం చెప్పారు. సాధారణ కుటుంబానికి చెందిన నాగరాజు తన కుమారుడు ఉన్నత విద్య సాధించాలని కలలు కన్నాడు. ఆ కలను నెరవేర్చాలనే తపనతో కన్నీళ్లతో పరీక్ష రాసిన ధనుష్, సహ విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన గ్రామ ప్రజలను మాత్రమే కాకుండా, వినేవారందరినీ ఆలోచింపజేసేలా చేసింది.
