
D Spiritual: Oct 28: నల్ల పూసల ప్రాముఖ్యత
హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన ఆడవాళ్లు కొన్ని సాంప్రదాయాలను ఖచ్చితంగా అనుసరించాల్సి ఉంటుంది. అలాంటి వాటిలో ముఖ్యంగా మంగళసూత్రం, కాలి మెట్టెలు, నల్లపూసలు ఇవన్నీ పెళ్లయిన తర్వాత ధరిస్తారు. ఈ విధంగా ఆభరణాలను ధరించడం మన సాంప్రదాయంలో ఒక భాగం అని చెప్పవచ్చు. ఆడవారికి అసలైన అందం ఇవే. కానీ ప్రస్తుతం ఉన్న ఈ మోడ్రన్ ప్రపంచంలో చాలా మంది నల్లపూసలు వేసుకోవటం లేదు. మరికొంతమంది మంగళసూత్రాలను కూడా అలంకారప్రాయంగా మాత్రమే ధరించి, సాంప్రదాయ ఆచారాలను విస్మరిస్తున్నారు.
నల్లపూసల ఉద్భవం మరియు ప్రాచీన ప్రాముఖ్యత
పూర్వకాలంలో పెళ్లి తర్వాత మహిళ మంగళసూత్రాన్ని నల్లపూసలలో వేసుకుని ధరించేది. అప్పట్లో ఈ నల్లపూసల నల్ల మట్టితో చేసేవారు. ఈ నల్ల మట్టితో తయారుచేసిన పూసలను వేసుకోవడం ద్వారా ఆ పూసలు మన ఛాతిపై పడటం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నమ్మకం. ఈ పూసలు ఛాతి మీద వరకు ధరించేవారు.
ఆరోగ్య ప్రయోజనాలు మరియు పూజా విధానం
కొంతమంది మంగళసూత్రాలలోనే రెండు పెద్ద నల్లపూసలు, రెండు ఎర్రపూసలు వేసేవారు. ఈ విధంగా నల్లపూసలు శరీరంలో వేడిని తగ్గించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కలిగిస్తాయి. మట్టితో తయారు చేసిన నల్లపూసల దండను వధూవరులచే నీలలోహిత గౌరీకి పూజ చేస్తారు. ఈ విధంగా పూజలు చేయడం ద్వారా గౌరీ మాత అనుగ్రహం లభించి, దంపతులు జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది.
దీర్ఘసుమంగళీభావం కోసం నల్లపూసలు
అంతేకాకుండా వధువు నిత్యం దీర్ఘసుమంగళీగా ఉండాలని భావించి ఈ గౌరీ వ్రతం చేస్తారు. నీలలోహిత గౌరీ సన్నిధిలో నల్లపూసల దండను ధరించడం వలన వధూవరులకు సంబంధించిన ఎటువంటి జాతక దోషాలు లేదా సర్పదోషాలు తొలగిపోతాయని పండితులు తెలియజేస్తున్నారు.
నేటి మార్పులు మరియు ఆధునిక దృక్పథం
అందువల్ల పూర్వకాలంలో పెళ్లైన మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసలలో మాత్రమే వేసుకుని ధరించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మట్టితో తయారు చేసిన నల్లపూసలు కనుమరుగైపోయాయి. ప్రస్తుతం బంగారు షాపులలో రెడీమేడ్ పూసలు దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మహిళలు మంగళసూత్రాన్ని నల్లపూసలలో కాకుండా, బంగారు దండలో వేసుకోవడం ఫ్యాషన్గా మారిపోయింది. మారుతున్న కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలు కూడా మారిపోతున్నాయి.
