
వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను సుదూర ఆశయాలుగా కాకుండా, తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తోందని పేర్కొన్నారు.
శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్వహించిన ‘వికసిత్ భారత్ వైపు భారతదేశ ప్రయాణానికి ఆర్థిక సహకారం’ సదస్సులో భట్టి విక్రమార్క మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని కేంద్రం, రాష్ట్రాలు విడివిడిగా సాధించలేవని, సహకార సమాఖ్య స్ఫూర్తితో సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు.
తెలంగాణ కేవలం నిధుల కోసం కేంద్రాన్ని ఆశ్రయించడం లేదని స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక దీర్ఘకాలిక లక్ష్యాలతో ఈ చర్చలో పాల్గొంటోందని భట్టి తెలిపారు. రాష్ట్రం ఇప్పటికే బలమైన ఆర్థిక పునాదులను ఏర్పరుచుకుందని తదుపరి దశలో మరింత వేగవంతమైన వృద్ధికి సిద్ధంగా ఉందని చెప్పారు.
2025-26లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ) రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని ప్రస్తుత ధరల ప్రకారం 10.7 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని ఇది జాతీయ సగటు రూ.2,19,575తో పోలిస్తే దాదాపు రెట్టింపు అని పేర్కొన్నారు. ఇదే సమయంలో సేవల రంగం 13.5 శాతం, ద్వితీయ రంగం 9.4 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు.
ప్రస్తుత వృద్ధి ధోరణి కొనసాగితే 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1.21 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్ఠాత్మకంగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుందని భట్టి వెల్లడించారు.
