
రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో కీవ్కు అండగా నిలిచిన ఓ యూరోపియన్ దేశం.. భారతీయ కంపెనీ నుంచి ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 70 మిలియన్ యూరోలు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.770 కోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసేందుకు ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
అయితే ఈ ఆయుధాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా, ఆ దేశ జాతీయ ఆడిట్ సంస్థ నిర్వహించిన పరిశీలనలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు నివేదిక వెలువడింది. ఈ పరిణామాల నేపథ్యంలో రక్షణ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
ఉక్రెయిన్కు సైనిక సహాయం అందించే ప్రక్రియలో భాగంగా భారతీయ సంస్థతో కుదుర్చుకున్న 70 మిలియన్ యూరోల (రూ. 768.50 కోట్లకు పైగా) ఆయుధాల కొనుగోలు ఒప్పందం ఎస్టోనియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పాటు, జాతీయ ఆడిట్ కార్యాలయం చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్ తన పదవికి రాజీనామా చేశారు.
2022 నుంచి రక్షణ మంత్రిగా కొనసాగుతున్న పెవ్కుర్.. వివాదాస్పద రక్షణ ఒప్పందం విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
‘‘ఎస్టోనియా భద్రత అనేది ఏ ఒక్కరి వల్ల సాధ్యమయ్యేది కాదు. అది మనందరి ఉమ్మడి బాధ్యత. అందుకే రక్షణ రంగానికి సంబంధించిన రాజకీయ బాధ్యతను స్వీకరిస్తూ, సరైన సమయంలో రక్షణ మంత్రి బాధ్యతలను ప్రధానమంత్రికి అప్పగించాలని నిర్ణయించుకున్నాను’’ అని పెవ్కుర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ ఆయుధాల కొనుగోలు ఒప్పందంపై తలెత్తిన వివాదం చివరకు రక్షణ మంత్రే పదవి నుంచి తప్పుకునే పరిస్థితికి దారితీయడం ఎస్టోనియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదానికి 2024లోనే బీజం పడింది. ఎస్టోనియాకు చెందిన సెంటర్ ఫర్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ (RKIK), ఇటలీలో నమోదైన ‘డేటాసెల్ ఎస్ఆర్ఎల్’ (Datasel SRL)తో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఈ సంస్థ భారతీయ కంపెనీ ‘నెకో డిఫెన్స్ మ్యునిషన్స్’ ఆధీనంలోకి వెళ్లింది. అయితే ఆర్టిలరీ షెల్స్ సరఫరా చేసిన గత అనుభవం పెద్దగా లేని ఈ కంపెనీకే ఉక్రెయిన్ కోసం అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేసే కాంట్రాక్ట్ను అప్పగించారు.
ఎస్టోనియన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ERRతో పాటు ‘ఈస్తీ ఎక్స్ప్రెస్’, ‘పోస్టీమీస్’ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఆయుధాల కొనుగోలుకు యూరోపియన్ యూనియన్ నిధులను వినియోగించారు. ఒప్పందంలో భాగంగా సుమారు 70 మిలియన్ యూరోలను ముందస్తు చెల్లింపుగా సంస్థకు అందించారు.
ఒప్పందం ప్రకారం కొద్ది నెలల్లోనే ఆయుధాలు ఉక్రెయిన్కు చేరాల్సి ఉంది. అయితే ఉత్పత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తడంతో సరఫరాలో తీవ్ర జాప్యం జరిగింది. చివరకు 2025లో ఆయుధాలు ఉక్రెయిన్కు చేరినప్పటికీ, అవి నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని ‘ఈస్తీ ఎక్స్ప్రెస్’ తన నివేదికలో పేర్కొంది.
