
D News: Jul 20: విశాఖపట్నం నగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నగరంలో ప్రజా రవాణాను మరింత ఆధునికంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికులను సురక్షితంగా, సౌకర్యవంతంగా చేరవేసేందుకు మొత్తం 100 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేసింది. తొలి దశలో ఇప్పటికే నాలుగు బస్సులు కూర్మన్నపాలెం చేరుకోగా, త్వరలోనే మిగిలిన బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ బస్సులు పూర్తి ఛార్జింగ్తో సుమారు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థలో భాగంగా రూపొందించిన ఈ బస్సుల్లో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు. ఆటోమేటిక్ తలుపులు, సీసీ కెమెరాలు, స్టేజీల సమాచారాన్ని ప్రకటించే మైక్ సిస్టమ్ వంటి భద్రతా, సౌకర్యవంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంజిన్ శబ్దం లేకుండా ప్రయాణం ప్రశాంతంగా సాగడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
భోగాపురం విమానాశ్రయానికి ప్రత్యేకంగా రెండు మార్గాల్లో బస్సు సర్వీసులను ప్రారంభించనున్నారు. గాజువాక–ఎన్ఏడీ కూడలి–గురుద్వారా–మద్దిలపాలెం–హనుమంతువాక–మధురవాడ–ఆనందపురం–తగరపువలస మీదుగా భోగాపురం వరకు పది బస్సులు నడపనున్నారు. మరో పది బస్సులు గాజువాక–సింధియా–రైల్వే స్టేషన్–ద్వారకా బస్ స్టేషన్–వుడా పార్కు–రుషికొండ–ఐటీ హిల్స్–మారికవలస–ఆనందపురం–తగరపువలస మార్గంలో సేవలు అందించనున్నాయి. తొలి విడతలో మొత్తం 20 బస్సులు విమానాశ్రయ ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానున్నాయి.
భోగాపురం విమానాశ్రయం వద్ద జీఎంఆర్ సంస్థ ప్రత్యేక లాంజ్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో బస్సులో 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉండగా, ఎక్కడం, దిగడం సులభంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టికెట్లను ఆర్టీసీ కండక్టర్లు జారీ చేయగా, బస్సులను ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన డ్రైవర్లు నడపనున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి భవిష్యత్తులో బస్సుల సంఖ్యను మరింత పెంచాలని అధికారులు భావిస్తున్నారు.
మొత్తం 100 ఎలక్ట్రిక్ బస్సుల్లో మిగిలిన 80 వాహనాలను నగర రవాణా సేవలకు వినియోగించనున్నారు. విశాఖ నగరంతో పాటు ఎలమంచిలి, అనకాపల్లి, విజయనగరం వంటి సమీప ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడపాలని ప్రణాళిక రూపొందించారు. ఆయా మార్గాలకు సంబంధించిన ఛార్జీల వివరాలను ఆర్టీసీ త్వరలో ప్రకటించనుంది.
ప్రజా రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఇంధన వ్యయాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల రాకతో విశాఖపట్నం ఆధునిక, పర్యావరణహిత రవాణా వ్యవస్థలో మరో ముందడుగు వేయనుంది. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించే అవకాశముండగా, విశాఖను గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడంలో ఈ బస్సులు కీలక పాత్ర పోషించనున్నాయి.
