
D News : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేలోపే ఓటీటీ రిలీజ్పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 26న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే మిశ్రమానికి మించి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం.
కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైన ‘టాక్సిక్’కు కథలో కొత్తదనం లేదని, యాక్షన్ ఎపిసోడ్లు, బోల్డ్ కంటెంట్పైనే ఎక్కువగా ఆధారపడ్డారనే విమర్శలు వచ్చాయి. దీంతో సినిమా టాక్ ప్రభావం బాక్సాఫీస్పై కూడా కనిపించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది.
అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ.. ఆ తర్వాత కలెక్షన్లు గణనీయంగా తగ్గినట్లు సమాచారం. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి సుమారు రూ.200 కోట్ల గ్రాస్ సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్, యశ్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకుంటే ఈ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే ‘టాక్సిక్’ OTT డీల్పై కూడా ఇప్పుడు కొత్త వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా విడుదలకు ముందు డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు మరింత ఎక్కువ ధరను ఆశించడంతో అప్పట్లో డీల్ ఖరారు కాలేదని టాక్.
థియేటర్లలో సినిమాకు వచ్చిన స్పందన తర్వాత పరిస్థితి మారిందని.. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తక్కువ మొత్తానికి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.30 కోట్లకు డీల్ కుదిరిందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు సాధారణంగా పెద్ద సినిమాలను థియేట్రికల్ రిలీజ్ తర్వాత 6 నుంచి 8 వారాలకు ఓటీటీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తుంటారు. కానీ ‘టాక్సిక్’ విషయంలో ఆ విండో తగ్గించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ చివరి వారంలోనే సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక OTT రిలీజ్ డేట్పై క్లారిటీ రావాల్సి ఉంది.
‘టాక్సిక్’ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ మాన్స్టర్ మైండ్స్ సంయుక్తంగా నిర్మించాయి. నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటించారు. అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయిందనే ప్రచారం మధ్య.. ఇంత త్వరగా ఓటీటీలోకి వస్తుందనే వార్తలు ఇప్పుడు యశ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఈ OTT రిలీజ్పై మేకర్స్ ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారో చూడాలి.
