
DArticle: Jun27: ఖనిజ సంపదలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం, దేశంలో లభించే పలు కీలక ఖనిజాల నిల్వల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా బెరైటీస్ (ముగ్గురాయి), మైకా, కాల్సైట్, కైనైట్, గ్రానైట్, బాక్సైట్, టైటానియం వంటి ఖనిజాల్లో రాష్ట్రం గణనీయమైన వాటాను కలిగి ఉంది.
బెరైటీస్లో దేశానికే కేంద్రం
దేశవ్యాప్తంగా ఉన్న బెరైటీస్ నిల్వల్లో సుమారు 92 శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. తిరుపతి జిల్లా మంగంపేట ప్రాంతంలోని గనులు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ఇక్కడ లభించే గ్రే బెరైటీస్ను చమురు, సహజవాయు బావుల డ్రిల్లింగ్లో విస్తృతంగా వినియోగిస్తారు. ఈ ఖనిజాన్ని దేశీయ సంస్థలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
అలాగే పెయింట్ల తయారీలో ఉపయోగించే వైట్ బెరైటీస్ ప్రధానంగా వైఎస్సార్ కడప జిల్లా వేముల, వేంపల్లి ప్రాంతాల్లో లభిస్తోంది. పులివెందుల, సింహాద్రిపురం, కలసపాడు, అనంతపురం, కర్నూలు, మార్కాపురం ప్రాంతాల్లో కూడా పరిమితంగా ఈ ఖనిజ నిల్వలు ఉన్నాయి.
మైకా, కాల్సైట్లోనూ ఏపీదే పైచేయి
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు అవసరమైన మైకా నిల్వల్లో దేశంలో 41 శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెల్లూరు, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు మైకా ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.
పెయింట్లు, కాగితం, ఔషధాలు, రసాయన పరిశ్రమల్లో వినియోగించే కాల్సైట్ నిల్వల్లో దేశంలోని 40 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో ఈ ఖనిజం విస్తారంగా లభిస్తోంది.
కైనైట్, గ్రానైట్ నిల్వల్లో కీలక స్థానం
అల్యూమినియం తయారీకి అవసరమైన కైనైట్ నిల్వల్లో దేశవ్యాప్తంగా 31 శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెల్లూరు, మార్కాపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఈ ఖనిజం ఎక్కువగా లభిస్తోంది.
గ్రానైట్ విషయంలో కూడా రాష్ట్రం విశేష స్థానం సంపాదించింది. దేశంలోని మొత్తం గ్రానైట్ నిల్వల్లో 31 శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. చీమకుర్తి ప్రాంతంలో లభించే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. శ్రీకాకుళం బ్లూ, మూన్ వైట్, రివర్ వైట్, స్టీల్ గ్రే, బ్లాక్ గ్రానైట్, వైట్ గ్రానైట్ వంటి అనేక విలువైన రకాల గ్రానైట్లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లభిస్తున్నాయి.
ఇతర ఖనిజాల్లోనూ భారీ నిల్వలు
స్టీల్, పెయింట్, పశు, పక్షి దాణా తయారీలో ఉపయోగించే డోలమైట్ నిల్వల్లో దేశంలోని 15 శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, పల్నాడు జిల్లాల్లో ఈ ఖనిజం లభిస్తోంది.
గూడూరు ప్రాంతం మైకాతో పాటు వెర్మిక్యులైట్ ఖనిజానికి కూడా ప్రసిద్ధి చెందింది. దేశంలోని మొత్తం వెర్మిక్యులైట్ నిల్వల్లో 12 శాతం రాష్ట్రంలోనే ఉన్నాయి.
సిమెంట్ పరిశ్రమలకు కీలకమైన లైమ్స్టోన్ (సున్నపురాయి) నిల్వల్లో దేశంలోని 12 శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అనంతపురం, నంద్యాల, వైఎస్సార్ కడప, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో ఈ నిల్వలు విస్తరించి ఉన్నాయి.
తీరప్రాంతాల్లో టైటానియం సంపద
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు విస్తరించిన సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ శాండ్ ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. వీటిలో టైటానియం మినరల్స్ లభిస్తున్నాయి. దేశంలోని మొత్తం టైటానియం ఖనిజ నిల్వల్లో సుమారు 19 శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించారు.
అదే విధంగా సిలిమినైట్ నిల్వల్లో రాష్ట్ర వాటా 13 శాతం కాగా, అల్యూమినియం పరిశ్రమలకు అత్యంత కీలకమైన బాక్సైట్ నిల్వల్లో 16 శాతం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో ఈ ఖనిజం ప్రధానంగా లభిస్తోంది.
పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాది
వివిధ రకాల ఖనిజాల సమృద్ధి కారణంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ ఖనిజ ఆధారిత పారిశ్రామిక రాష్ట్రంగా ఎదుగుతోంది. ఈ ఖనిజ సంపద సిమెంట్, ఉక్కు, అల్యూమినియం, ఎలక్ట్రానిక్స్, పెయింట్స్, రసాయన పరిశ్రమల అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఎగుమతుల పెరుగుదలకు ఈ ఖనిజ వనరులు కీలక పాత్ర పోషించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
