
DNews:24 Mar: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరతపై మంగళవారం అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి, అక్కడ గ్యాస్ సిలిండర్ల ఆకారంలో ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా) జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతిని గ్యాస్ కొరత ఏర్పడిందని, దీనివల్ల సామాన్య గృహిణులు, హోటల్ నిర్వాహకులు మరియు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం కొరత లేదని చెప్పడం, రాష్ట్ర ప్రభుత్వం తనకేం సంబంధం లేదనడం ప్రజలను మోసం చేయడమేనని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణలో సామాన్యులు “ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్లు” ఇబ్బంది పడుతున్నారని ఆయన సెటైర్లు వేశారు. గ్యాస్ సిలిండర్ల సైజును కూడా భవిష్యత్తులో తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేస్తూ, తక్షణమే సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం బీఆర్ఎస్ నేతలు అదే ప్లకార్డులతో అసెంబ్లీకి చేరుకుని సభలో కూడా ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు.
