
DNews:20 Nov:హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతుండటంతో, రాజధాని హైదరాబాద్ నగరంపై చలి పంజా విసురుతోంది. పగటిపూట కూడా చలి తీవ్రత కొనసాగుతుండటంతో, గూడు లేని నిరాశ్రయులకు రాత్రులు నరకయాతనగా మారుతున్నాయి. ఫుట్పాత్లు, బస్ స్టాప్లు, ఫ్లైఓవర్ల కింద గడిపే ఈ నిరాశ్రయులకు బాసటగా నిలిచేందుకు జీహెచ్ఎంసీ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది.నిరాశ్రయుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని, చలి తాకిడిని ఎదుర్కోలేక ఇబ్బంది పడుతున్న వారికి షెల్టర్ హోమ్స్లో ఆశ్రయం కల్పించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్లో పది ప్రాంతాల్లో ఈ షెల్టర్ హోమ్లు నడుస్తున్నాయి.ఈ కేంద్రాలలో నివసించే వారికి ఉచితంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి అన్నంతో పాటు ఉచిత వసతి కల్పిస్తున్నారు.
షెల్టర్ హోమ్స్కు తరలింపు రోడ్ల మీద తిరుగుతున్న నిరాశ్రయులను బల్దియా ప్రత్యేక బృందాలు గుర్తించి ఈ కేంద్రాలకు తీసుకువెళ్తున్నాయి.పనిమీద నగరానికి వచ్చి, ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నవారు కూడా ఇక్కడ ఆశ్రయం పొందవచ్చు.మానసిక సమస్యలతో రోడ్లపై తిరుగుతున్న వారికి కూడా ఈ కేంద్రాలు తాత్కాలిక ఆవాసాలుగా ఉపయోగపడుతున్నాయి.ప్రస్తుతం ఈ పది కేంద్రాల్లో మొత్తం 269 మంది సామర్థ్యం ఉండగా, సుమారు 164 మంది మాత్రమే ఆశ్రయం పొందుతున్నారు.ఇక్కడ గరిష్ఠంగా ఆరు నెలల వరకు నివసించేందుకు అనుమతి ఉంటుంది.
గోల్నాక, ఉప్పల్, సరూర్నగర్ ప్రాంతాల్లోని షెల్టర్ హోమ్లను పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. మిగతా కేంద్రాలు పురుషులకు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం షెల్టర్ హోమ్స్ నడుస్తున్న ప్రాంతాలు: పేట్లబురుజు, ఉప్పల్, శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీ, టప్పాచబుత్రా, గోల్నాక, యూసుఫ్ గూడ, శేరిలింగంపల్లి, మరియు బేగంపేట్ ఫ్లైఓవర్ సమీపంలో మూడు కేంద్రాలు.బేగంపేటలో ఉన్న ఒక కేంద్రాన్ని జీహెచ్ఎంసీ రికవరీ సెంటర్గా మార్చింది.మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నవారు మొదట ఆస్పత్రుల్లో చికిత్స పొందిన తర్వాత ఇక్కడ కొంతకాలం పర్యవేక్షణలో ఉంటారు.వారు ఆరోగ్యంగా మారిన తర్వాత ఇతర షెల్టర్లకు తరలించడం లేదా వారి కుటుంబాలను గుర్తించి వారికి అప్పగించడం చేస్తారు.ఈ పది కేంద్రాలలో ఎనిమిది కేంద్రాలు ఎన్జీవోల భాగస్వామ్యంతో నడుస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఈ సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoU) చేసుకుని, ఒక్కో షెల్టర్ హోమ్ నిర్వహణ కోసం నెలకు రూ. 23,333 ఖర్చు చేస్తోంది.
