
ఉద్యోగ జీవితంలో వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఓ బస్సు డ్రైవర్ పదవీ విరమణకు ముందు తన చివరి ట్రిప్ను పూర్తి చేసి తాను నడిపిన బస్సుకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. స్టీరింగ్ వీల్ను ఆప్యాయంగా ముద్దాడి బస్సుకు సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలను కేఎస్ఆర్టీసీ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్గా మారింది. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇడుక్కి జిల్లాలోని కేఎస్ఆర్టీసీ కుమిలి డిపోకు చెందిన డ్రైవర్ పాల్ కురియన్ సెప్టెంబర్ 2న తన చివరి విధులను పూర్తి చేశారు. షిఫ్ట్ ముగిసిన అనంతరం బస్సును డిపోలో పార్క్ చేసిన ఆయన కొద్దిసేపు డ్రైవర్ సీటు వద్దకు వెళ్లారు. స్టీరింగ్ వీల్ను ఆప్యాయంగా ముద్దాడి, అనంతరం బస్సుకు సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేఎస్ఆర్టీసీ అధికారులు ఈ క్షణాలను వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. బస్సును కేవలం వాహనంగా కాకుండా తన 18 ఏళ్ల ఉద్యోగ జీవితంలో విడదీయరాని భాగంగా భావించిన కురియన్ వీడ్కోలు పలికిన తీరు పలువురిని భావోద్వేగానికి గురిచేసింది.
పాల్ కురియన్ 18 ఏళ్ల పాటు కుమిలి కట్టప్పన డిపోల్లో కేఎస్ఆర్టీసీ డ్రైవర్గా సేవలందించారు. తన మొత్తం సర్వీస్లో ప్రమాద రహిత డ్రైవింగ్ రికార్డును కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా తమిళనాడులోని కంబం–కొట్టాయం మధ్య నడిచే అంతర్రాష్ట్ర సర్వీసును ఆయన డ్రైవ్ చేశారు. ఈ క్రమంలో బస్సుతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని కురియన్ తెలిపారు.
“నా అధికారిక పదవీ విరమణ అక్టోబర్ 31న ఉంది. అయితే సెప్టెంబర్ 2 నా చివరి శారీరక విధి. ఇన్నేళ్లుగా నన్ను, నా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఈ బస్సుకు చివరి రోజు వందనం చేయాలని అనిపించింది” అని ఆయన పేర్కొన్నారు.
తాను చేసే పనిని ఎంతో ఆస్వాదించానని, అందుకే ఉద్యోగం ఎప్పుడూ భారంగా అనిపించలేదని కురియన్ చెప్పారు. పదవీ విరమణ తర్వాత ఎంప్యానెల్డ్ డ్రైవర్గా పనిచేసే అవకాశం లభిస్తే మళ్లీ యూనిఫాం ధరించి సంతోషంగా బస్సు నడుపుతానని తెలిపారు.
18 ఏళ్ల సేవకు ముగింపు పలుకుతూ తన బస్సుకు కురియన్ ఇచ్చిన ఈ ఆత్మీయ వీడ్కోలు ఉద్యోగం, ప్రయాణికులు, వాహనం మధ్య ఏర్పడే అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. చివరి ట్రిప్ అనంతరం బస్సుకు సెల్యూట్ చేసిన ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
