
D Spiritual: Dec 19: సాధారణంగా హిందువులు తమ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం గుడికి వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. గుడికి వెళ్లిన తర్వాత భక్తిశ్రద్ధలతో దీపం వెలిగించి దేవుడిని ప్రార్థిస్తారు. అయితే చాలామందికి గుడిలోకి వెళ్లిన తర్వాత ముందుగా దీపం ఎక్కడ వెలిగించాలి, ఏ క్రమంలో పూజ చేయాలి అనే విషయాలు స్పష్టంగా తెలియవు. అందుకే ఆలయ ప్రాంగణంలో తమకు అనువైన చోట దీపం వెలిగిస్తూ ఉంటారు.
ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించి, ఆ తరువాత దేవాలయానికి వెళ్లడం చాలామంది అలవాటు. దేవాలయానికి వెళ్లిన తర్వాత సాధారణంగా అందరూ నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి ముందు దీపం వెలిగించి పూజ చేస్తుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని పండితులు చెబుతున్నారు.
ఆలయానికి వెళ్లిన వెంటనే నేరుగా గర్భగుడిలోకి వెళ్లకుండా, ముందుగా ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గరకు వెళ్లి అక్కడ నమస్కరించి దీపం వెలిగించాలి. ఇది దేవాలయ పూజా క్రమంలో ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు.
ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించిన తరువాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఈ సమయంలో ఆలయంలో ఉన్న ఇతర దేవతలకు కూడా నమస్కరించి పూజ చేయాలి. ఏ ఆలయానికి వెళ్లినా తప్పనిసరిగా మూడు ప్రదక్షిణలు చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఆ తరువాత ఐదు, తొమ్మిది లేదా భక్తికి అనుగుణంగా మరిన్ని ప్రదక్షిణలు చేయవచ్చు.
ప్రదక్షిణలు పూర్తయిన తరువాత గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి ముందు దీపం వెలిగించాలి. తాము తీసుకువెళ్లిన పండ్లు, పూలు, నైవేద్యాలను దేవుడికి సమర్పించి భక్తితో నమస్కరించాలి. అనంతరం ఆలయం నుంచి నేరుగా ఇంటికి తిరిగి వెళ్లడం మంచిదిగా భావిస్తారు.
