
D Spiritual: Dec 19: లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కలగాలనుకునే వారు శుక్రవారం రోజున అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ప్రత్యేకంగా దీపారాధన చేయాలని పండితులు సూచిస్తున్నారు. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో, ఆ రోజున చేసే పూజలు త్వరగా ఫలితాలు ఇస్తాయని నమ్మకం.
ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అందుకోసం అనేక రకాల పూజలు, పరిహారాలు పాటిస్తుంటారు. అయితే లక్ష్మీ అనుగ్రహం కలిగితే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని, ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. శుక్రవారం నాడు కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటిస్తే సంపద రెట్టింపు అవుతుందని, అమ్మవారి కటాక్షం ఇంట్లో నిలుస్తుందని విశ్వాసం.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శుక్రవారం ఈ విధంగా దీపాన్ని వెలిగించాలి. ముందుగా ఐదు తమలపాకులను తీసుకుని వాటికి గంధం రాసి, పసుపు–కుంకుమతో బొట్లు పెట్టాలి. ఆ తరువాత ఆ తమలపాకులను గుండ్రంగా పేర్చాలి. వాటి మీద ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదకు కూడా కుంకుమ, గంధం, పసుపుతో అలంకారం చేయాలి.
ఆ ప్రమిదలో రాళ్ల ఉప్పును పూర్తిగా నింపి, అందులో కూడా పసుపు మరియు కుంకుమ వేయాలి. తరువాత మరో ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి, రెండు వత్తులను ఏకవత్తిగా చేసి ఉప్పు వేసిన ప్రమిద మీద ఉంచి దీపారాధన చేయాలి. అనంతరం దీపం చుట్టూ పూలతో అలంకరించుకోవాలి.
ఈ దీపానికి హారతి ఇచ్చి, అక్షింతలు వేసి లక్ష్మీదేవిని భక్తితో నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయని చెబుతున్నారు.
శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు ఆవులకు పచ్చిగడ్డి ఆహారంగా పెట్టడం ఎంతో శుభకరమని అంటారు. అది సాధ్యం కాకపోతే నెయ్యి, బెల్లం కలిపిన ఆహారాన్ని ఇవ్వవచ్చని చెబుతున్నారు.
అలాగే శుక్రవారం రాత్రి నిద్రకు ముందు లక్ష్మీదేవి విగ్రహానికి మల్లెపూలను సమర్పిస్తే డబ్బు సమస్యలు దూరమవుతాయని నమ్మకం. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పిస్తే దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఐదు దీపాలను వెలిగించి హారతి ఇవ్వడం కూడా ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. దీనినే పంచముఖి దీపం అంటారు. ఈ విధంగా పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, కుటుంబంలో ఆనందం, సంపద, శాంతి నెలకొంటాయని విశ్వాసం.
