
D Spiritual: Oct 29: నవగ్రహ పూజ ప్రయోజనాలు
సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువులనే నవగ్రహాలు అంటారు. నవగ్రహాలను పూజించడం, హోమాలు చేయడం, వ్రతాలు ఆచరించడం హిందూ సంప్రదాయాలలో ఒక ముఖ్య భాగం. అయితే అసలు నవగ్రహాలను ఎందుకు పూజించాలి? దాని వెనుకున్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం.
నవగ్రహాల ప్రభావం
నవగ్రహాలు మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. చెడు ప్రభావం తగ్గి శుభఫలితాలు కలగాలంటే నవగ్రహ పూజ చేయాలని పండితులు, పెద్దలు సూచిస్తారు. సూర్యుడు శక్తిని, విజయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుడు ఉద్వేగాలను నియంత్రించి మానసిక ధైర్యాన్ని పెంచుతాడు. అంగారకుడు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు.
ప్రతి గ్రహం యొక్క ప్రాధాన్యం
బుధుడు జ్ఞానాన్ని ప్రసాదించి ఆలోచనా పరిణతిని పెంచుతాడు. గురుడు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపజేస్తాడు. శుక్రుడు అందం, ఆనందం, ప్రేమ, విలాసాలను అందిస్తాడు. శని మనం చేసే పనులకు తగిన ఫలితాలను ప్రసాదిస్తాడు. కేతువు గతజన్మ కర్మఫలాలను తగ్గిస్తాడని చెబుతారు. రాహువు జీవితంలో ఎదురయ్యే గందరగోళాలను తొలగిస్తాడని విశ్వాసం.
నవగ్రహ పూజ ప్రాముఖ్యత
మన కష్టాలు తగ్గాలన్నా, ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా నవగ్రహ పూజ చేయాలని పండితులు చెబుతారు. ఈ పూజ ద్వారా మన జీవితం శాంతి, సుఖసంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు.
నవగ్రహ ఉపాసన విధానం
నవగ్రహ ఉపాసనకూ ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. ఏదైనా గుడికి వెళ్లినప్పుడు మొదటగా నవగ్రహ మండపానికే వెళ్లాలి. ఆ సమయంలో నవగ్రహ శ్లోకాలను పఠిస్తూ వాటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. సాధ్యమైనంత వరకు పదకొండు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. అది సాధ్యంకాకపోతే సూర్యుడు నుంచి ప్రారంభించి సవ్వదిశలో కనీసం మూడు ప్రదక్షిణలైనా పూర్తి చేయాలి.
ఉపాసనలో జాగ్రత్తలు
ప్రదక్షిణల సమయంలో నవగ్రహాల విగ్రహాలను తాకకూడదు. ప్రదక్షిణలు పూర్తయ్యాక కాళ్లు కడుక్కోవడం వల్ల దోషాలు పోతాయని చాలామంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నవగ్రహ దర్శనం తర్వాత నేరుగా గర్భగుడిలోని మూలవిరాట్టును దర్శించడం శ్రేయస్కరం.
