
D News: దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ సంగీత సంస్థ సరిగమ ఇండియా లిమిటెడ్ మధ్య కొనసాగుతున్న కాపీరైట్ వివాదం మరోసారి కోర్టుకు చేరింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ సరిగమ ఢిల్లీ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
పాటల హక్కులపై వివాదం
తమకు హక్కులు ఉన్న పాటలను థర్డ్ పార్టీలకు విక్రయించడం, లైసెన్స్ ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని సరిగమ ఆరోపించింది. ‘మురట్టుక్కాలై’ సినిమా పాటల విషయంలోనూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోకుండా మద్రాస్ హైకోర్టులో ఉత్తర్వులు పొందారని సంస్థ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
స్పాటిఫై, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో పాటల వినియోగానికి సంబంధించి కూడా కోర్టు ఆదేశాల ఉల్లంఘన జరిగిందని సరిగమ ఆరోపించింది.
ఆస్తుల జప్తు.. జైలు శిక్ష కోరుతూ
ఈ ఆరోపణల నేపథ్యంలో ఇళయరాజాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని సరిగమ కోరింది. అంతేకాకుండా ఆస్తుల జప్తు, సివిల్ జైలు శిక్ష విధించాలని కోర్టును అభ్యర్థించినట్లు సమాచారం.
అయితే ఇవి సరిగమ చేసిన అభ్యర్థనలు మాత్రమే.. కోర్టు ఇప్పటికే ఆస్తుల జప్తు లేదా జైలు శిక్ష విధించినట్లు కాదు. ఈ కాపీరైట్ వివాదంపై తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
