
D Spiritual: Jul 21: తిరుమలలో అడవి వరాహాల విషయంలో భక్తులకు అధికారుల హెచ్చరిక
శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రమైన తిరుమలకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు కాలినడకన చేరుకుంటుంటారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో సంచరించే అడవి పందులను (వరాహాలను) కొందరు భక్తులు లక్ష్మీ వరాహస్వామి ప్రతిరూపాలుగా భావించి ప్రత్యేక భక్తి ప్రదర్శిస్తున్నారు. వాటికి పసుపు, కుంకుమలు అద్ది బొట్లు పెట్టడం, పూజలు చేయడం, చేతులతోనే ఆహారం తినిపించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.
భక్తులు స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో ఇలా చేస్తున్నప్పటికీ, అడవి వరాహాలు వన్యప్రాణులేనని అధికారులు గుర్తుచేస్తున్నారు. వాటి సహజ స్వభావాన్ని విస్మరించి అత్యంత సమీపానికి వెళ్లడం ప్రమాదకరమని, భక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
దూరంగా ఉండాలని టిటిడి, అటవీ శాఖ సూచన
అడవి వరాహాలు ఆత్మరక్షణ కోసం ఎప్పుడైనా దాడి చేసే స్వభావం కలిగి ఉంటాయని అటవీ శాఖ, టిటిడి అధికారులు హెచ్చరిస్తున్నారు. భక్తులు వాటికి తరచూ ఆహారం ఇవ్వడం వల్ల అవి మనుషులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుందని, ఆహారం లభించకపోతే భక్తులపై, ముఖ్యంగా చిన్నారులపై దాడి చేసే ప్రమాదం ఉందని తెలిపారు.
అలాగే బొట్లు పెట్టడం లేదా పూజలు చేసే నెపంతో వాటి దగ్గరకు వెళ్లినప్పుడు, భయపడి అవి ఒక్కసారిగా దాడి చేసే అవకాశం కూడా ఉందని అధికారులు పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అడవి వరాహాలకు ఆహారం ఇవ్వడం, పూజలు చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. భక్తులు సురక్షితంగా శ్రీవారి దర్శనం చేసుకుని, వన్యప్రాణులతో సురక్షిత దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
