
D News: Jul 9: ఉమ్మడి ఆదిలాబాద్లో ఆలయాలపై దొంగల కన్ను.. సీసీ కెమెరాలతో వరుస కేసులు ఛేదిస్తున్న పోలీసులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా ఆలయాల్లో చోరీ ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా దొంగలు అన్ని రకాల దేవాలయాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఆలయాల నుంచి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేని గుడుల వరకు అవకాశం దొరికినప్పుడల్లా నగదు, నగలు, విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన పలు ఆలయాల చోరీ కేసులను పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సాంకేతిక పరిజ్ఞానం మరియు సీసీ కెమెరాల సహాయంతో నిందితులను వేగంగా అరెస్టు చేస్తున్నారు. బాసర ఆలయం నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల ఆలయాల్లో జరిగిన చోరీల వరకు అనేక కేసులు సీసీ కెమెరాల ఆధారంగానే ఛేదించగలిగారు.
ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్లోని హనుమాన్ ఆలయంలో చోరీకి ఓ దొంగ ప్రయత్నించాడు. అక్కడ విఫలమవడంతో సమీపంలోని ఇతర ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన యువకుడు జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం ఆలయాల్లోనే చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్కు చెందిన కొలాయం కాశీనాథ్ అనే డిగ్రీ విద్యార్థి ఆలయాల్లోని విగ్రహాల నగలు, హుండీ నగదును లక్ష్యంగా చేసుకుని పలు చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
నిందితుడిపై ఆదిలాబాద్ టూ టౌన్, భీంపూర్, తలమడుగు, మావల పోలీస్ స్టేషన్లలో రెండేసి చొప్పున, వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు చోరీ కేసులు నమోదయ్యాయి. ఆలయాల్లో దొంగిలించిన బంగారం, వెండి నగలను విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో వాహనాల తనిఖీలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో అతడి వద్ద నుంచి 30 తులాల వెండి, 2.50 తులాల బంగారు ఆభరణాలు, ఒక ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు, రూ.2,150 నగదు, ఇత్తడి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
చోరీ చేసిన నగలను ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్డులో ఉన్న బంగారం వ్యాపారి లోకాజీ విశ్వనాథ్కు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో నిందితుడితో పాటు చోరీ సొత్తును కొనుగోలు చేసిన బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
మరోవైపు మంచిర్యాల జిల్లాలో కూడా ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 5వ తేదీ రాత్రి స్థానిక విశ్వనాథ ఆలయంలోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలోని విలువైన వస్తువులను అపహరించారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం దుబ్బగూడెంకు చెందిన రౌతు పవన్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
నిందితుడు గతంలో మంచిర్యాలతో పాటు కరీంనగర్, హనుమకొండ, హుస్నాబాద్ ప్రాంతాల్లోని పలు ఆలయాల్లో కూడా చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. అతడి వద్ద నుంచి సుమారు 900 గ్రాముల వెండి నగలు, రూ.65 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో నమోదైన ఈ రెండు ప్రధాన ఆలయ చోరీ కేసులను సీసీ కెమెరాల సహాయంతోనే పోలీసులు విజయవంతంగా ఛేదించడం విశేషం.
