
D News: Jul 8: వాట్సాప్లో వచ్చిన నకిలీ వాటర్ బిల్లు మెసేజ్ను నమ్మిన ఓ రిటైర్డ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ.4.19 లక్షలు కోల్పోయాడు. ఓటీపీ, పిన్ లేదా పాస్వర్డ్ చెప్పకపోయినా, మాల్వేర్ యాప్ల సాయంతో బ్యాంకు ఖాతాలోని నగదును కాజేసిన ఘటన ఎల్బీనగర్ సమీపంలోని రాక్టౌన్ కాలనీలో వెలుగుచూసింది.
బాధితుడికి జూలై 1న వాట్సాప్లో “హైదరాబాద్ వాటర్ బోర్డు బిల్లు చెల్లించలేదు.. వెంటనే చెల్లించకపోతే నీటి కనెక్షన్ నిలిపివేస్తాం” అంటూ ఓ మెసేజ్ వచ్చింది. అందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయగా, తనను వివేక్ శర్మగా పరిచయం చేసుకున్న వ్యక్తి వాటర్ మీటర్ కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పి యూపీఐ, ఎస్బీఐ బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలు సేకరించాడు.
కొద్దిసేపటికే అనుమానం రావడంతో బాధితుడు కాల్ను నిలిపివేసినా, అప్పటికే వాటర్ బోర్డు అధికారిక యాప్ల మాదిరిగా కనిపించే రెండు నకిలీ యాప్లు అతని ఫోన్లో ఇన్స్టాల్ అయ్యాయి. ఆ మాల్వేర్ సాయంతో సైబర్ నేరగాళ్లు ఎలాంటి ఓటీపీ అవసరం లేకుండానే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.4.19 లక్షలు బదిలీ చేశారు. మోసాన్ని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన నేపథ్యంలో సైబర్ పోలీసులు కీలక సూచనలు చేశారు. వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే బిల్లు చెల్లింపు సందేశాలను వెంటనే నమ్మవద్దని, అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారానే బిల్లులు చెల్లించాలని సూచించారు. అపరిచితులు పంపిన యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేయొద్దని, యూపీఐ, బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని లేదా సమీప సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
