
DNews: Mar 06: చెన్నైలో ప్రస్తుతం “మద్రాస్-ఐ” అనే కంటి ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. వైద్యాధికారుల ప్రకారం వాతావరణ మార్పుల కారణంగా ఈ ఇన్ఫెక్షన్ సాధారణ స్థాయితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదవుతోంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మద్రాస్-ఐ అనేది కంటి మరియు కనురెప్పలను కలిపే మ్యూకస్ మెంబ్రేన్లో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది గాలి, కాలుష్యం ద్వారా వ్యాపించడమే కాకుండా, బాధపడుతున్న వారు ఉపయోగించే వస్తువులను ఇతరులు వాడితే కూడా వ్యాపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల గణాంకాల ప్రకారం ఇటీవల ఈ ఇన్ఫెక్షన్ కేసులు పెరిగాయి. వైద్యులు చెబుతున్నదేమిటంటే, మద్రాస్-ఐ సాధారణమైన ఇన్ఫెక్షన్ అయినప్పటికీ, దీన్ని తొందరగా గుర్తించి సరైన చికిత్స చేయాలి. నిర్లక్ష్యం చేస్తే చూపు మసకబారే ప్రమాదం ఉంది. కంటి ఎర్రబారడం, కంటి దురద, నీరు కారడం, కనురెప్పలు అతుక్కుపోవడం ప్రధాన లక్షణాలు. ఒక కంటికి వచ్చినప్పుడు మరొక కంటికి కూడా వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. పాత కాంటాక్ట్ లెన్స్లు తొలగించి, వైద్యుల సలహాతో కొత్త లెన్స్లు వాడాలి. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. గత కొన్ని వారాలుగా రోజుకు కనీసం వందమంది ఈ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. వారిలో ఎక్కువ మంది పిల్లలే కావడం ఆందోళన కలిగిస్తోంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
